ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.దీనికి సంబందించిన ఉత్తుర్వులు గురువారంనాడు వెలువడ్డాయి. ఈ ఉత్తుర్వుల ప్రకారం పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు.
అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, మూసివేయాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీసు కమీషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు .ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరీంనగర్ పోలీసు కమీషనర్ తెలిపారు.
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమలు -కరీంనగర్ సీపీ గౌస్ ఆలం


