ప్రజాతెలంగాణ- కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియాతో కలిసి కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రాలలోని హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, ఫార్మసీ స్టోర్లలోని మందుల నిల్వలు మరియు రికార్డులను పరిశీలించారు.13 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులలో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించారు. షుగర్ వ్యాధి మరియు అధిక రక్తపోటు నిర్ధారణ అయిన వారందరికీ ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభించే మందులను వాడేలా ప్రోత్సహించాలని అన్నారు.కట్టరాంపూర్లోని ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపుకు వచ్చిన మహిళలతో అందుతున్న ఆరోగ్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కట్టరాంపూర్ పట్టణ కేంద్ర సిబ్బందితో సమావేశం నిర్వహించి రానున్న వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి చర్చించారు.
మే 28న జరుగు అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం గురించి మాట్లాడుతూ, కౌమారదశ బాలికలకు రుతుస్రావ పరిశుభ్రత గురించి అవగాహన కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియా, కట్టరాంపూర్ వైద్యాధికారి డాక్టర్ నవ్య, పద్మనగర్ బస్తీ దవాఖాన వైద్యాధికారి డాక్టర్ రాజకుమార్ మరియు ఆయా ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :