– గంగాధర మండలంలో 468 మందికి మంజూరు ఉత్తర్వులు అందజేత
ప్రజాతెలంగాణ-గంగాధర : పారదర్శకంగా, పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుపుతున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.జీవీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం 468 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు.గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని మేడిపల్లి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి కలను సాకారం చేస్తోందని తెలిపారు.గంగాధర మండలంలో మొత్తం 721 మందికి మొదటి దఫాలో ఇళ్లు మంజూరయ్యాయని, కురిక్యాల గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా 200 మందికి ఇళ్లు నిర్మాణం జరుగుతోందన్నారు .గంగాధర మండలానికి సంబంధించి గత సర్కారు కేవలం 17 కోట్లు రుణమాఫీ మాత్రమే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48 కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నామని అన్నారు.త్వరలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. నారాయణపూర్ కాలువలు పూర్తయితే ప్రాంతం కోనసీమగా మారుతుందని తెలిపారు.
కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే చొరవతో ఈ నియోజకవర్గంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయని అన్నారు. జిల్లాలో ఇప్పటికే బేస్మెంట్ లెవల్ కు చేరిన ఇండ్లకు సంబంధించి సొమ్ము ఖాతాలో జమ చేసామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే ముందు పంచాయతీ సెక్రటరీ దృష్టిలో ఉంచాలని అన్నారు. జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ గంగాధర్, తహసిల్దార్ అనుపమ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :