ప్రజా తెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని అంగన్వాడీ కేంద్రాలను జూన్ 10లోగా తప్పనిసరిగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు.శనివారం స్థానిక సుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన అడిషనల్ కలెక్టర్, ఇదివరకే 63 కేంద్రాలను మార్చినట్లు వెల్లడించారు. అద్దె భవనాల్లోని అంగన్వాడీలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రభుత్వ భవనాలకు మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాలలకు అంగన్వాడీలను మార్చిన తర్వాత అవసరమైన వసతులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని దేశాయ్ సూచించారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, మరమ్మతులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెటర్నరీ సెంటర్లు సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదివరకే మంజూరైన మౌలిక సదుపాయాల పనులను వెంటనే పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ రెహ్మాన్, సిడిపిఓలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం : ఎస్యూలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలి – చరిత్ర పరిరక్షణ సమితి