ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: పోలీసు రికార్డుల్లో హిస్టరీ షీటర్లుగా కొనసాగుతున్న నేరచరితులు సత్ప్రవర్తనతో మెలగాలని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు . పరివర్తన చెందకుండా పాత పద్ధతులను అనుసరిస్తూ నేరాల్లో భాగస్వాములైతే పీడీ యాక్ట్ను అమలు చేసి సంవత్సరాల తరబడి జైల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.శుక్రవారం కరీంనగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, క్షణికావేశాలతో అనాలోచిత విధానంలో గతంలో నేరాలకు పాల్పడిన వారు సత్ప్రవర్తనతో మెలిగితే వారి పేర్లను పోలీసు రికార్డుల నుండి తొలగిస్తామన్నారు . గత ఐదు సంవత్సరాలుగా ఏ నేరాల్లో భాగస్వాములు కాకుండా, అనారోగ్యంతో, సత్ప్రవర్తనతో ఉన్న వారి పేర్లను పోలీసు రికార్డుల నుండి తొలగించేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా నేరచరితులు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకుని తమపై ఆధారపడిన కుటుంబాలను పోషించేందుకు జీవనోపాధి కోసం మార్గాలను అన్వేషించాలని తెలిపారు. హిస్టరీ షీటర్లు మారకపోతే తమ పిల్లలతో స్నేహం చేసేందుకు తోటి పిల్లలు ముందుకు రాకపోవడమే కాకుండా వివాహాది శుభకార్యాలకు కూడా ఆటంకాలు ఏర్పడే ప్రమాదంఉందన్నారు .రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతోందని తెలిపిన సీఐ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మారెడ్డితో పాటు 25 మంది హిస్టరీ షీటర్లు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :