దేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ -ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజాతెలంగాణ- వెబ్ డెస్క్  :  గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.యాసంగీ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం సాగు జరగలేదని మంత్రి తెలిపారు. కాలేశ్వరం ,సుందిళ్ల ,అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నుంచి చుక్క నీరు రాకున్నా అధికారుల సహకారం, ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యల వల్ల అత్యధికంగా వరి సాగైందని పేర్కొన్నారు.

రైతుల కొనుగోలులో రికార్డు

28 మే నాటికి యాసంగి పంట కొనుగోలు కోసం రైతులకు రాష్ట్రంలో దాదాపు 13 వేల కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ హయాంలో ఇదే సమయం 2023 సంవత్సరానికి 3 వేల 500 కోట్లు మాత్రమే చెల్లించారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రైతులకు 2 వేల 782 కోట్ల చెల్లిస్తే 2023లో 538 కోట్లు మాత్రమే చెల్లించారని అన్నారు.

ప్రజా ప్రభుత్వం 28 మే నాటికి 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, 2023లో 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.

దేశంలోనే మొదటి సన్న బియ్యం పథకం

భారతదేశంలో మొదటి సారిగా రాష్ట్రంలోనే 84% జనాభాకు ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ చరిత్రలోనే విప్లవాత్మకమైన పథకమని సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నామని అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పథకం అమలు కావడంలేదని మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

ప్రాజెక్టుల విస్తరణ

ఎస్సార్ఎస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీ సిల్టేషన్ ఆధునిక పద్దతుల్లో పూర్తి చేసి పూర్వపు సామర్థ్యం తీసుకొని వస్తామని అన్నారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు.బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తామని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి వెల్లడించారు.

నీటిపారుదల శాఖ బలోపేతం

నీటి పారుదల శాఖ పరిధిలో 1100 ఇంజనీర్లు, 1800 మంది లష్కర్లను నియమించామని మంత్రి తెలిపారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాగునీటి శాఖను సమగ్రంగా ప్రక్షాళన చేశామని స్పష్టం చేశారు.

గురువారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు , కలెక్టర్లు , వివిధ శాఖల ఉన్నతాధికారులు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం :

రాజీవ్ యువ వికాసం యూనిట్లకు పటిష్ట కార్యాచరణ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!