ప్రజాతెలంగాణ – కరీంనగర్: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టి నీటి నమూనాలను పరీక్షించి క్లోరినేషన్ చేయాలని అన్నారు. గత సంవత్సరం ఎక్కువ వ్యాధులు ప్రబలిన గ్రామాలు, వార్డులను గుర్తించి జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. డెంగీ కేసులు నమోదు అయితే ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
వనమహోత్సవం విజయవంతం చేయాలి
జిల్లాలో అనువైన ప్రదేశాల్లో మొక్కలు నాటి వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జూన్ మొదటి వారం నుండి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అన్నారు. మునగ, జామ, బొప్పాయి, నిమ్మ, కానుగ మొక్కలతో పాటు వివిధ పండ్ల మొక్కలు నాటాలని సూచించారు.
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, డీఎఫ్ఓ బాలమణి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం : జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్